ముంబై రియల్‌ ఎస్టేట్‌: కోలుకునేదెపుడో?

దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై రియల్‌ ఎస్టేట్‌ రంగం మునుపెన్నడూ లేనివిధంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నెలకు పది వేల ఇళ్ళను కూడా అమ్మడం గొప్పగా చెప్పుకుంటున్నారంటే… పరిస్థితి ఎంత నిరాశాజనకంగా ఉందో చెప్పొచ్చు. 2003 నుంచి 2016 వరకు ముంబై రియల్‌ ఎస్టేట్‌ ఆకాశమే హద్దుగా పెరిగింది. ధరలు 700 శాతం నుంచి 800 శాతం పెరిగాయి. అంతే ఒక్కసారిగా వచ్చి పడిన నోట్ల రద్దుతో ఈ రంగం కుదైలేంది. అప్పటి నుంచి కోలుకోలేకపోయింది. పశ్చిమ ముంబై తప్ప మిగిలిన ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ కోలుకోవడం కష్టంగా ఉంది. గోరేగావ్‌… ములంద్‌ మధ్య లింక్‌ రోడ్‌, మెట్రోలైన్‌, కోస్టల్‌ రోడ్‌ వంటి కొత్త ప్రాజెక్టుల వల్ల కాస్త ఊతం లభిస్తున్నా… నిధుల సమస్యను ఈ రంగాన్ని వెంటాడుతూనే ఉంది. పశ్చిమ ముంబైలో మాత్రం గత రెండేళ్ళ నుంచి మంచి అభివృద్ధి కన్పిస్తోంది. కొత్తగా అమ్ముడుబోయిన ఇళ్ళలో సగానికి పైగా టర్నోవర్‌ ఇక్కడి నుంచే వచ్చింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పెరగడంతో కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. అయితే ఖరీదైన నిర్మాణాలు మాత్రం ఇప్పటికే దక్షిణ ముంబైకి పరిమితమయ్యాయి.