‘ఆనందయ్య మందుపై కన్నేసిన కాకాని’

కరోనా ఫస్ట్‌వేవ్‌లో రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటే, సెకండ్ వేవ్‌లో ఆనందయ్య మందును వ్యాపారంగా మార్చుకునేందుకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రయత్నించారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
నెల్లూరులో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించి పలు కీలక విషయాలను మీడియా ముందు ఉంచారు. ఆనందయ్య మందును ఆన్‌లైన్‌ అమ్మేందుకు childeal.in అనే వెబ్ సైట్ బయటకు వచ్చిందని, దీన్ని తయారు చేసింది నెల్లూరుకు చెందిన సెశ్రిత(SESRITHA) కంపెనీ అని సోమిరెడ్డి వెల్లడించారు.
అటు ప్రకటన ఇటు వెబ్‌సైట్‌…
కృష్ణపట్నంలో కాకాణి మందు పంపిణీ చేపట్టిన మే 21వ తేదీనే గోడాడీ (Godaddy) కంపెనీ వద్ద childeal.in డొమైన్‌ను సెశ్రిత టెక్నాలజీ ఇండియా ప్రై లిమిటెడ్ కొనుగోలు చేసిందన్నారు. ఈ సెశ్రిత కంపెనీ నిర్వాహకులు కాకాణికి, అధికార పార్టీకి అత్యంత సన్నిహితులని సోమిరెడ్డి వెల్లడించారు.
కోర్టు ఓకే అనగానే…
ఆనందయ్య మందు పంపిణీకి హైకోర్టు అనుమతించిన 31వ తేదీనే ఆన్‌లైన్‌లో మందు పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభించామని కాకాని మీడియాకు వివరించిన వీడియోను సోమిరెడ్డి చూపించారు. జూన్ 2వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత ఆన్ లైన్‌లో chiledeal.in వెబ్ సైట్ కనిపించిందని…ఫ్యాన్ గుర్తు, సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, కాకాణి ఫొటోలు, వైసీపీ రంగులతో వెబ్ సైట్ హోమ్ పేజీ ఉందని … దానికి సంబంధించిన ఫొటోలు, డాక్యుమెంట్లను సోమిరెడ్డి మీడియాకు చూపారు. నకిలీ మద్యం, నకిలీ పత్రాలకు తరహాలోనే నకిలీ వెబ్ సైట్‌ను ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు.
ఆనందయ్య మందుతో ప్రజల నుంచి భారీగా వసూలు చేసేందుకు కుట్ర చేశారన్నారు.
ప్యాకెట్‌ ధర రూ. 167
ఆయుర్వేదం మందు ఒక్కో ప్యాకెట్ రూ.167కి అమ్ముకునేందుకు కాకాని పన్నాగం పన్నారని.. వెబ్‌సైట్‌లో ధరకు సంబంధించి పేర్కొన్న వివరాలను సోమిరెడ్డి వెల్లడించారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఆనందయ్య కుటుంబం ప్రశ్నించడంతో కాకని వర్గంలో కలవరం మొదలైందని, కథ అడ్డం తిరిగిందని భావించి, వెబ్ సైట్‌ను పక్కనపెట్టారని సోమిరెడ్డి వివరించారు. అప్పటి వరకు మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని హడావుడి చేసిన కాకాణి ఒక్క సారిగా ప్లేటు ఫిరాయించారన్నారు. ఆనందయ్య మందుతో తమకు, తమ పార్టీకి సంబంధం లేదని హడావుడిగా ప్రకటన చేశారన్నారు. లేదంటే వందల కోట్లు దోచుకునేందుకు భారీ స్కెచ్ వేశారని సోమిరెడ్డి ఆరోపించారు.
దర్యాప్తు చేయాలి
ప్రభుత్వం స్పందించి ఈ కుట్రపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ వెబ్ సైట్ వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారుల గుట్టు విప్పి చర్యలు తీసుకోవాలన్నారు.
లేదంటే తామే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కూడా పాల్గొన్నారు.