బెట్టింగ్‌ బిజినెస్‌లో ఉన్నవారికి ఐపీఎల్‌ జట్టు ఇస్తారా?

దేశంలో ఐపీఎల్‌ నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన లలిత్‌ మోడీ తాజా కొత్తగా విషయాన్ని వెలుగులోకి తెచ్చాడు. అహ్మదాబాద్‌ టీమ్‌ను సీవీసీ క్యాపిటల్‌ తాజా బిడ్డింగ్‌లో రూ. 5,600 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ కంపెనీ వ్యాపారాలపై ఇపుడు లలిత్‌ మోడీ కామెంట్‌ చేశారు. గేమింగ్‌, బెట్టింగ్‌ వ్యాపారాల్లో ఉన్న మూడు ప్రధాన కంపెనీల్లో సీవీసీ క్యాపిటల్‌కు వాటాలు ఉన్నాయని.. అలాంటి కంపెనీకి ఐపీఎల్‌ జట్టు ఎలా ఇస్తారని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మూడు కంపెనీల పేర్లను ప్రస్తావించారు. జర్మనీకి చెందిన టిపికొ కంపెనీ 2016లో ఏర్పడిందని, ఈ కంపెనీ స్పోర్ట్స్‌ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌ సేవలను అందిస్తోందని అన్నారు. జర్మనీలో ఈ కంపెనీకి 1,200 ఫ్రాంఛైజీలు ఉన్నాయి. మరో కంపెనీ సిసాల్‌. ఈ కంపెనీ ఇటలీలో గేమింగ్‌ రంగలో ఉంది. ఈ కంపెనీకి 47,000 పాయింట్స్‌ ఆఫ్‌ సేల్స్‌ ఉన్నాయని లలిత్‌ మోడీ పేర్కొన్నారు. ఇటలీలో ఆన్‌లైన్‌ క్యాసినో గేమింగ్‌ రంగంలో ఈ కంపెనీ రెండో స్థానంలో ఉందని, ఆన్‌లైన్‌ స్పోర్ట్స్‌ బెట్టింగ్‌లో ఈ కంపెనీ నాలుగో స్థానంలో ఉందని లలిత్‌ మోడీ పేర్కొన్నారు. మూడో కంపెనీ స్కయ్‌ బెట్‌. బ్రిటన్‌కు చెందిన ఈ కంపెనీ యూరప్‌తో పాటు అమెరికాలో ఆన్‌లైన్‌ స్పోర్ట్స్‌ బెట్టింగ్‌, గేమింగ్‌ కార్యకలాపాల్లో విస్తరించింది. ఈ మూడు కంపెనీల్లో సీవీసీ క్యాపిటల్‌ పెట్టుబడులు పెట్టిందని లలిత్‌ మోడీ అన్నారు. ఒక వైపు జట్టు యజమానిగా ఉంటూ.. మరోవైపు గేమింగ్‌ కంపెనీలలో వాటా ఉండటంపై ఆయన పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే భవిష్యత్తుల్లో గేమింగ్‌ బిజినెస్‌కు అనుగుణంగా కూడా అహ్మదాబాద్‌ టీమ్‌ నిర్ణయాలు తీసుకునే అవకాశముందని లలిత్‌ మోడీ పరోక్ష ఆరోపణ అన్నమాట. నేరుగా చెప్పాలంటే ఐపీఎల్‌పై బెట్టింగ్‌ బిజినెస్‌ ప్రభావం ఉంటుందని ఆయన అంటున్నారు. దీంతో సీవీసీ క్యాపిటల్‌పై బీసీసీఐ తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ఆయన అంటున్నారు. లలిత మోడీ ప్రస్తావించిన అంశాల్లో నిజముంది కాబట్టి…ఈ బిడ్డింగ్‌పై బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related Articles