మార్చి 2న మదనపల్లెలో యువగళం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర మార్చి 2, 3 తేదీల్లో మదనపల్లెకు రానుందని మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ తెలిపారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్‌ చేపట్టిన పాదయాత్ర రెండు రోజుల పాటు మదనపల్లె నియోజకవర్గంలో జరుగుతుందని, నియోజకవర్గంలోని మూడు మండలాలు, పట్టణంలోని టీడీపీ కార్యకర్తలు యువగళం పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌ రూ.9.16 లక్షల కోట్లు అప్పులు చేసినా కేవలం రూ.4.42 లక్షల కోట్లు మాత్రమే చూపిస్తోందని మిగిలిన రూ.5 లక్షల కోట్లు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని, నమ్మిన ప్రజలను జగన్‌ మోసం చేస్తున్నారని, దీనిని ఎండగట్టడానికే నారా లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నారన్నారు.