17 ఏళ్ల బాలికపై అమానుషం

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. తనతో పెండ్లికి నిరాకరించిందని 16 ఏళ్ల బాలికను 47 ఏళ్ల వయసున్న వ్యక్తి పదునైన ఆయుధంతో దాడిచేసి నడి రోడ్డుపై జట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రాయ్‌పూర్‌లోని గుఢియారీ ప్రాంతంలో ఓంకార్‌ తివారీ అలియాస్‌ మనోజ్‌ అనే వ్యక్తి ఓ దుకాణం నడుపుతున్నాడు. గతకొంతకాలంగా అతని వద్ద ఓ 16 ఏళ్ల బాలిక పనిచేస్తుంది. అయితే వివిధ కారణాల రీత్యా తాను ఉద్యోగం మానేస్తానని అతనికి చెప్పింది. దానికి అతడు ఒప్పుకోకపోగా, శనివారం సాయంత్రం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఆమెను పెండ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనికి ఆ మైనర్‌ బాలికతోపాటు ఆమె తల్లి నిరాకరించారు. దీంతో ఆగ్రహంతో ఆ బాలికపై పదునైన ఆయుధంతో దాడిచేశాడు. అంతటితో ఆగకుండా ఆమె జట్టుపట్టుకుని అంతా చూస్తుండగా రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ అమానుష ఘటనను కొందరు తమ కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఇదికాస్తా వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.