గవర్నర్‌కు కౌశిక్ రెడ్డి క్షమాపణలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళిసైపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తూ జాతీయ మహిళా కమిషన్‌ను క్షమాపణలు కోరారు. మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుతూ గవర్నర్ తమిళిసైకు లిఖితపూర్వకంగా లేఖ రాస్తానని మహిళా కమిషన్‌కు కౌశిక్ రెడ్డి వివరించారు. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు మంగళవారం ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ ముందు కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పిన ఆయన.. గవర్నర్‌కు కూడా లేఖ ద్వారా క్షమాపణలు చెబుతానంటూ వివరణ ఇచ్చారు. గవర్నర్‌పై కౌశిక్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. వివరణ ఇవ్వాలని ఫిబ్రవరి 12న నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీ వెళ్లిన కౌశిక్ రెడ్డి.. జాతీయ మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చారు.
కౌశిక్ రెడ్డి వెంట ఆయన తరపు లాయర్ కూడా ఉన్నారు. ఇంకోసారి గవర్నర్‌ను కించపరుస్తూ మాట్లాడనని, క్షమించాలని మహిళా కమిషన్‌ను కోరారు.