మధ్యప్రదేశ్‌లో ఘోరప్రమాదం, ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సిద్ధి జిల్లాలోని రేవా-సాత్నా సరిహద్దుల్లో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అదుపుతప్పి ఆగి ఉన్న రెండు బస్సులను ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. ప్రమాదం ధాటికి ఒక బస్సు రెండు భాగాలుగా విడిపోగా, మరొకటి నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో 10 నుంచి 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. రెండు బస్సులు సాత్నాలో జరుగుతున్న కోల్‌ మహాకుంభ్‌ పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.