మూసాపేట్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి

హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో ఓ స్క్రాప్ గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది. హెచ్‌పీ రోడ్‌లోని గోడౌన్‌లో ఆటోలో స్క్రాప్ లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. పేలుడులో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కెమికల్స్ ఖాళీ డబ్బలను టాటా ఏస్ వాహనంలో లోడ్ చేస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు చెబుతున్నారు. కెమికల్స్ ఉన్న డబ్బ వాహనంపై నుండి కింద పడిపోవడంతో పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుడిని ముషీరాబాద్ బోలక్‌పూర్‌కు చెందిన మహమ్మద్ నజీర్‌గా గుర్తించారు. నజీర్ తండ్రి ఇస్మాయిల్ స్క్రాప్ కొనుగోలు చేస్తుంటారు. ముసాపేట ప్రాంతంలో డబ్బలను లోడ్ చేస్తుండగా క్రింద పడిపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు సనత్‌నగర్ ఎస్‌ఐ చంద్రయ్య తెలిపారు.