కొనసాగిన ర్యాలీ

సెమి ఫైనల్స్‌లో బీజేపీ విజయం సాకుతో మార్కెట్‌లో షేర్ల ధరలను పెంచే ప్రయత్నం జరుగుతోంది. రోజూ ఏదో ఒక సెక్టర్‌ షేర్లు వెలుగులో ఉంటున్నాయి. నిన్నటి దాకా బ్యాంకులు, ఇవాళ ఐటీ. ఇక అదానీ షేర్ల సంగతి సరేసరి. చివరికి ప్రభుత్వ రంగ షేర్ల మద్దతుతో సూచీలను పెంచే ప్రక్రియ సాగుతోంది. కంపెనీ పనితీరుతో సంబంధం లేకుండా… మున్ముందే ఏదో జరుగబోతోందనే అంచనాతో సూచీలను పెంచుతున్నారు. తేజస్‌ విమానంలో ప్రధాని మోడీ విహరించిన తరవాత హెచ్‌ఏఎల్‌ షేర్‌ ఇప్పటి వరకు 23 శాతం పెరిగింది. కంపెనీ పనితీరులో ఎలాంటి మార్పు లేదు. కాని షేర్‌ మాత్రం ఏడాదిలో డబుల్‌ అయింది. భారీ ఆర్డర్లను చూపుతున్నారు. మరిఎపుడు పూర్తవుతాయి? మార్జిన్‌ ఏమిటి అనే సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక ఇవాళ నిఫ్టి మరో 82 పాయింట్లు పెరిగి 20,937ని తాకింది. రేపు 21000 స్థాయిని దాటుతుందేమో చూడాలి. నిఫ్టి 29 షేర్లు పెరిగితే 21 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది మార్కెట్‌. చాలా రోజుల తరవాత ఇవాళ విప్రో షేర్‌ 4 శాతం దాకా పెరిగింది. అలాగే ఎల్‌ అండ్‌ టీ ఐఎంతో పాటు టీసీఎస్‌ కూడా లాభాలతో ముగిశాయి.

Related Articles