అయినా… నిందితునిగా చేర్చలేదు

అధికార పార్టీలో ఉన్నా లేదా అధికారీ పార్టీ పక్షమైనా సీబీఐ పనితీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎంపీ సుజనా చౌదరి కేసు. బోగస్‌ కంపెనీల ద్వార రూ. 5000 కోట్లు ముంచాడని స్వయంగా నిన్న హైకోర్టులో అఫిడవిట్‌ వేసింది సీబీఐ. కాని అతన్ని ఇంకా నిందితునిగా చేర్చలేదు. అలా చేర్చకపోవడం వల్లే అమెరికా వెళ్ళేందుకు సుజనా చౌదరిని హైకోర్టు అనుమతించింది. దాదాపు రెండేళ్ళ నుంచి సుజానా చౌదరికి చెందిన కంపెనీలపై సీబీఐ దాడులు చేస్తూనే ఉంది. నేరపూరితమైన పత్రాలను స్వాధీనం చేసుకుంటూనే ఉంది. కొన్ని బ్యాంకులు కోర్టులో కేసులు కూడా వేశాయి. కాని సీబీఐ మాత్రం సుజనా చౌదరిని ఇంకా నిందితునిగా చేర్చలేదట. చైన్నై కేంద్రంగా ఉన్న బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, దాని డైరెకర్టర్లు బ్యాంకుల నుంచి వేల కోట్లకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ పొందాయని సీబీఐ పేర్కొంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నింటిని బోగస్‌ కంపెనీలకు తరలించాయి. ఇలా లబ్ది పొందినే అనేక కంపెనీ సుజనా గ్రూప్‌నకు చెందిన కంపెనీలేనని ఏడాది క్రితమే బయటపడింది. హైదరాబాద్‌ నాగార్జున సర్కిల్‌లోని సుజనా హెడ్డాఫీసులో దీనికి సంబంధించి అనేక డాక్యుమెంట్లు సీబీఐకి లభించాయి. ఇవి కాకుండా స్ప్లెండిడ్‌ మెటల్స్‌ కంపెనీ, సుజనా టవర్స్‌, సుజనా యూనివర్సల్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకున్నా ఎగ్గొట్టాయి. అస్సలు లేని భూములు ఉన్నాయంటూ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న ఘనత సుజనా చౌదరిది. కాని ఇన్ని విషయాలు బహిరంగ పరుస్తున్న సీబీఐ సుజనాను ఎందుకు ఇంకా నిందితునిగా చేర్చలేదో అర్థం కాలేదు. ఎందుకంటే అలా చేర్చకపోవడం వల్లే సుజనా చౌదరి ఇపుడు లోకం చుట్టిన వీరుడిలా ఎంచక్కా విదేశాలు తిరుగుతున్నాడు. కరోనా సాకు చూపుతూ సుజనా చౌదరి విచారణకు హాజరు కాకుండా ఎగ్గొడ్తున్నారని సీబీఐ చెప్పడం విడ్డూరం. ఇతర కేసుల్లో ఇలాగే వ్యవహరిస్తున్నారా? కేవలం అధికార పార్టీలో ఉన్నందునే చూసీ చూడనట్లు సీబీఐ వ్యవహరిస్తోందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది.