ఎక్సైజ్‌ వసూళ్లు 79శాతం పెరిగాయి

ఎక్సైజ్‌ శాఖ వసూళ్ళు ఈ ఏడాది ఏప్రిల్‌ – సెప్టెంబర్‌ మధ్య కాలంలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం పెరిగాయి. ఈ సమయంలో రూ. 1.28 లక్షల కోట్ల నుంచి రూ. 1.71 లక్షల కోట్లకు ఎక్సైజ్‌ వసూళ్ళు పెరిగాయి. అదే కోవిడ్‌ ముందు రోజులతోఒ పోలిస్తే 79 శాతం పెరిగాయి. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌(సీజీఏ) లెక్కల ప్రకారం కరోనా వెలుగులోకి రావడానికి ముందు 2019, ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య ఇవి రూ.95,930 కోట్లుగా ఉన్నాయి. అప్పటితో పోలిస్తే 79 శాతం పెరుగుదల నమోదైంది. ఎక్సైజ్‌ సుంకం ద్వారా 2020-21లో పూర్తి ఏడాదికి రూ.3.89 లక్షల కోట్లు, 2019-20లో రూ.2.39 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ పెరుగుదలకు కారణం పెట్రోల్‌,డీజిల్‌పై కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్‌ సుంకమే కారణం. ఎందుకంటే వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తర్వాత పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌, సహజవాయువు పైన మాత్రమే ఎక్సైజ్‌ సుంకం విధిస్తున్నారు.