రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. గంజాయి మత్తులో మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కిరాణా కొట్టులో కూర్చున్న ఓ బాలుడిని గంజాయి బ్యాచ్ బలవంతంగా దానమ్మ జోపిడి గుట్టల వద్దకు తీసుకుని వెళ్లింది. గంజాయికి డబ్బులు ఇవ్వాలని బాలుడు సమీర్ బట్టలు విప్పి బెల్ట్, కర్రలతో దాడి చేశారు. బాలుడిని ముఠా సభ్యులు తీవ్రంగా హింసించారు. ఈ దాడిలో సమీర్ తీవ్రంగా గాయపడ్డారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న సమీర్ ఇంటికి చేరుకున్నాడు. సమీర్ ఒంటిపై గాయాలు చూసిన కుటుంబసభ్యులు వెంటనే అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తనను కిరాణాకొట్టు నుండి కొంత మంది తీసుకొని వెళ్లి డబ్బులు ఇవ్వాలని విచక్షణారహితంగా కొట్టారంటూ తల్లిదండ్రులకు బాలుడు చెప్పారు. గంజాయి బ్యాచ్ దారుణంపై మైలార్దేవిపల్లి పోలీస్స్టేషన్లో బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మహ్మద్ సైఫ్, అబ్బూ, సమీర్తో పాటు మరో ఐదుగురపై ఫిర్యాదు చేశారు. అయితే తమపై కేసు పెట్టారని తెలిసిన ముఠా సభ్యులు.. ‘నీకు దిక్కు ఉన్న చోట చెప్పుకో ఇప్పటికే ఇద్దరిని హత్య చేశాం’ అంటూ బాలుడిని బెదిరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.