పాపికొండల పర్యాటకులకు షాక్

పాపికొండల పర్యాటకులకు అటవీశాఖ షాక్ ఇచ్చింది. పాపికొండల్లో రాత్రి వేళల్లో హోటల్స్‌లలో బస చేయడానికి అనుమతి నిరాకరించింది. ఈ మేరకు అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోటల్స్‌లలో రూమ్ బుకింగ్స్‌ను ఆపేయాలని యాజమాన్యాలను ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించినవారిపై ఫారెస్ట్ యాక్ట్ చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. లాంచీలలో మాత్రమే విహరించేందుకు అనుమతి ఉంటుందని, రాత్రి బసకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే గతంలోనే రాత్రి బసకు అటవీశాఖ అనుమతి ఇవ్వలేదు. కానీ లాంచీ ఓనర్లు హైకోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈ అనుమతి గడువు ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంటుంది. గత నెలతో గడువు ముగియడంతో పోలీసులు రాత్రి బసకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో పాపికొండల్లోని కొల్లూరు హట్స్‌లో రాత్రి బస ఆగిపోయింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో.. ఎవరూ ఓపెన్ చేయడం లేదు. గుడువు ముగియడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకునేందుకు లాంచీ ఓనర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలోనే హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశముంది.

Related Articles