ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు తారుమారు

హైదరాబాద్ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది నిర్వాకం బయటపడింది. అప్పుడే పుట్టిన పిల్లలను ఆస్పత్రి సిబ్బంది మార్చేసి తల్లులకు అప్పగించారు. ఆడపిల్ల అని చెప్పి మగబిడ్డను ఎందుకు ఇస్తున్నారని కుటుంబసభ్యులు హాస్పిటల్ సిబ్బందిని నిలదీశారు. దీంతో పొరపాటు జరిగిందంటూ తల్లిదండ్రులకు ఆడ శిశువును వైద్యులు అప్పగించడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే.. మీర్‌పేటలోని అల్మాస్‌గూడకు చెందిన జ్యోతిని ప్రసవం కోసం ఈ నెల 20న కుటుంబసభ్యులు వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. మంగళవారం ఆమె ఆడపిల్లలకు జన్మనివ్వగా.. ఆపరేషన్ తర్వాత మహిళను వార్డుకు తరలించే క్రమంలో వార్డు బాయ్ పొరపాటున మగబిడ్డను తెచ్చి ఇచ్చాడు. దీంతో ఆడబిడ్డ పుట్టిందని చెప్పి మగబిడ్డను ఎందుకు ఇస్తున్నారంటూ వార్డ్ బాయ్‌తో వాగ్వాదానికి దిగారు. ఎంతసేపు అడిగినా వార్డ్ బాయ్ మాత్రం పుట్టింది మగబిడ్డే అంటూ గొడవకు దిగాడు. ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యను పరిష్కరించారు. పొరపాటున వార్డు బాయ్ వేరే మహిళకు పుట్టిన మగబిడ్డను తెచ్చి జ్యోతికి ఇచ్చాడని, అందువల్లే తప్పు జరిగిందంటూ సర్ధిచెప్పే ప్రయత్నం చేయడంతో కుటుంబసభ్యులు శాంతించారు. జ్యోతికి సిజేరియన్ ఆపరేషన్ చేసిన సమయంలోనే మరో వార్డులో రమ్య అనే మహిళకు కూడా ఆపరేషన్ చేశారు. రమ్య మగబిడ్డకు జన్మనివ్వగా.. వార్డు బాయ్ పొరపాటున ఆమెకు పుట్టిన మగబిడ్డను జ్యోతికి ఇచ్చాడు. అప్పటికే ఆడపిల్ల పుట్టినట్లు వైద్యులు జ్యోతి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కానీ వార్డు బాయ్ మగబిడ్డను తెచ్చి ఇవ్వడంతో కుటుంబసభ్యులు గొడవకు దిగడంతో హాస్పిటల్‌లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి వార్డు బాయ్ తప్పిదం వల్ల జరిగిందని చెప్పిన వైద్యులు.. అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పిదానికి పాల్పడ్డ వార్డ్ బాయ్‌ను విధుల నుంచి తప్పిస్తామని వైద్యులు చెప్పారు.

Related Articles