ఎందుకీ వివక్ష?

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మెడికల్‌ కాలేజీల మంజూరు విషయంలో ఇది మరోసారి రుజువైందన్నారు. ఈ మేరకు కేంద్రం వైఖరిని తప్పుబడుతూ హరీశ్‌రావు ఆదివారం వరుస ట్వీట్లతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ తీరునూ ఆయన తప్పుబట్టారు. ‘మెడికల్‌ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం. రాష్ట్రానికి మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరితే 157 మెడికల్‌ కాలేజీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపింది. నర్సింగ్‌ కాలేజీల విషయంలో కూడా అదే వివక్షను ప్రదర్శించింది’ అని ట్విటర్‌లో హరీశ్‌రావు విమర్శించారు. పైగా మెడికల్‌ కాలేజీల విషయంలో ఒక్కో కేంద్ర మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం బాధాకరమన్నారు. ‘ఒకరు రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు అంటే, మరొకరు కరీంనగర్‌, ఖమ్మంలో మెడికల్‌ కాలేజీ కోసం తెలంగాణ అడిగిందనీ, అక్కడ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉండటం వల్ల మంజూరు చేయలేకపోయామని చెబుతున్నారు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు?’ అని హరీశ్‌ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ ఇవ్వకపోయినా, నిధులు మంజూరు చేయకపోయినా.. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర నిధులతో 12 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారని తెలిపారు. ఈ ఏడాది 9, మరో ఏడాది 8 ఇలా.. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ‘లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉండటం వాస్తవం కాదా? ఒకే ఏడాది, ఒకే రోజు తెలంగాణ ప్రభుత్వం 8 మెడికల్‌ కాలేజీలను ప్రారంభిస్తే.. ప్రశంసించేందుకు మనసురాని వాళ్లు ఇలా పసలేని విమర్శలు, ఆరోపణలు చేయడం సమంజసమా?’ అని మంత్రి ప్రశ్నించారు. గతంలో బీబీనగర్‌ ఎయిమ్స్‌కి తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించలేదని చెప్పి ఓ కేంద్ర మంత్రి నాలుక కరచుకున్నారని, తాము ఆధారాలు చూపించాక నోట మాట రాలేదని తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్‌ స్థాయిలో ఉండాల్సిన బీబీనగర్‌ ఎయిమ్స్‌.. గల్లీలోని పీహెచ్‌సీ స్థాయిలో కూడా ఎందుకు లేదని ప్రశ్నించారు. దీనికి రూ.1365 కోట్ల నిధులు మంజూరు చేయాల్సి ఉండగా రూ.156 కోట్లు (11.4 శాతం) మాత్రమే మంజూరు చేశారని, గుజరాత్‌ ఎయిమ్స్‌కు మాత్రం 52 శాతం నిధులు ఇచ్చారని తెలిపారు. ఈ అన్యాయాల గురించి ఏ ఒక్కరూ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. చివరిగా.. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల మేరకు గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ వంటి వాటిని మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంపై రాజ్‌భవన్‌ దృష్టి పెడితే తెలంగాణ ప్రజలకు గొప్ప మేలు చేసినవారవుతారంటూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఉద్దేశించి హరీశ్‌రావు వాఖ్యానించారు.

Related Articles