అవినాష్ రెడ్డి దొరికిపోయిన దొంగ

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దొరికిపోయిన దొంగ అని.. దొరికిపోయిన దొంగలు ప్రతిపక్షాలు, మీడియా మీద నిందలు వేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు విమర్శించారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకానంద హత్యకు సంబంధించి సాక్ష్యాలను అవినాష్ రెడ్డి నాశనం చేశారని ఆరోపించారు. టెక్నాలజీ సహాయంతో సీబీఐ వాస్తవాలను బయటపెడుతుందని, దొరికిపోయిన దొంగలు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. వివేకానంద రెడ్డి కుమార్తె సునీత చేస్తున్న పోరాటం నిందితుల మెడకు బలంగా చుట్టుకుందని బోండా ఉమ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందన‌ చూసి సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని బోండా ఉమ అన్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వే ద్వారా ఇంటికెళ్లిపోతామని జగన్‌కు తెలిసిపోయిందన్నారు. అందుకే లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని, పార్టీ కార్యాలయాలపై దాడులు, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అతి త్వరలోనే దుర్మార్గపు పరిపాలనకు ప్రజలు చరమగీతం పలకబోతున్నారని బోండా ఉమ పేర్కొన్నారు.

Related Articles