రోడ్డు ప్రమాదంలో నవ దంపతుల దుర్మరణం

వాళ్లిద్దరు మూడు రోజుల క్రితమే వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఎంతో సంతోషంగా వైవాహిక జీవితాన్ని ప్రారంభిద్దామని కలలు కన్నారు. ఇంతలోనే ఊహించని విషాదం ఆ దంపతుల్ని వెంటాడింది. కాళ్లపారాణి ఆరకే ముందే రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదం రూపంలో నూతన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం బెల్లుపడ కాలనీలో ఉంటున్న వేణు రత్తకన్న దగ్గర ఓ షాపులో పనిచేస్తున్నాడు. అతడికి బ్రహ్మపురకు చెందిన సుభద్రతో సింహాచలంలో ఈ నెల 10న వివాహమైంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరూ హాజరయ్యారు.. ఆ వేడుక అనంతరం సింహాచలం నుంచి వచ్చి 12న ఇచ్ఛాపురంలో విందు ఏర్పాటు చేశారు. నూతన వధూవరుల్ని అందరూ ఆశీర్వదించారు. సోమవారం ఇచ్ఛాపురం నుంచి ఒడిశాలోని అత్తవారింటికి వెళ్లేందుకు బైక్‌పై దంపతులు బయలుదేరారు. ఇంతలో ఒడిశా సరిహద్దులోని గొళంత్రా దగ్గర ఓ ట్రాక్టర్‌ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా.. సుభద్ర అక్కడే చనిపోయింది. తీవ్రగాయాలైన వేణును బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. మూడు రోజుల క్రితమే వివాహమైంది.. ఇంతలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారన్న వార్తతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. వేణు తండ్రి గతంలోనే చనిపోగా.. అమ్మ, అన్నయ్య, అక్కతో కలసి ఉంటున్నారు. దీంతో వేణును తలచుకుని బోరున విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles