నేటి నుంచి బయోఏషియా సదస్సు..

బయో ఏషియా (20వ సదస్సు) సదస్సు శుక్రవారం ప్రారంభం కానున్నది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో ఉదయం 10 గంటలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. మూడు రోజులపాటు సాగే ఈ సదస్సు సందర్భంగా లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, మెడ్‌టెక్‌, ఆరోగ్య సంరక్షణ రంగాలపై నిపుణుల ప్రసంగాలు, బృంద చర్చలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 2 వేలకు మందికిపైగా ప్రముఖులు హాజరవుతున్నారు. వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక సమావేశాలు, ప్రపంచస్థాయి నిపుణులతో చర్చలు, ఇంటరాక్టివ్‌ సెషన్స్‌, సీఈవో కాంక్లేవ్‌, స్టార్టప్‌ షోకేస్‌, బయోపార్క్‌ సందర్శనలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. రెండురోజులపాటు లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, పరిశ్రమ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తారు.   వివిధ కంపెనీలకు చెందిన ప్రదర్శన ఉంటుంది. జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తారు. భారత్‌లోని లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ సదస్సు చక్కని వేదికగా ఉపయోగపడుతున్నది. అలాగే, పెట్టుబడుల ఆకర్షణకు కూడా ఇది దోహదపడుతున్నది.

Related Articles