పెట్రోల్ పోయించుకుని డబ్బులు అడిగితే చంపేశారు !

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్‌లో పని చేసే సిబ్బందిపై ముగ్గురు యువకులు విచాక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు కారులో ముగ్గురు యువకులు జన్వాడ వద్ద గల పెట్రోల్ బంక్‌కు వచ్చారు. అప్పటికే బంక్ మూసేసి ఉండగా.. తాము చాలా దూరం వెళ్లాలని పెట్రోల్ పోయాలని సిబ్బందిని కోరారు. దీంతో వారు కారులో పెట్రోల్ పోశారు. అనంతరం డబ్బు పే చేసేందుకు గానూ కార్డ్ ఇచ్చారు. అయితే తమ దగ్గర స్వైప్ మిషన్ పనిచేయటం లేదని.. లిక్విడ్ క్యాష్ ఇవ్వాలని బంక్ క్యాషియర్ యువకులను కోరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువకులు మాకే ఎదురు చెబుతావా ? అంటూ క్యాషియర్‌పై దాడి చేశారు. ఇది గమనించిన సంజయ్ అనే మరో కార్మికుడు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సంజయ్‌పై కూడా యువకులు పిడిగుద్దులు కురిపించారు. దీంతో సంజయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి బంక్ సిబ్బంది అతన్ని సమీప ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అతను అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఘటన జరిగిన అనంతరం ముగ్గురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. దాడి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీ టీవీ పుటే‌ను పరిశీలించారు. ముగ్గురు యువకులపై మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles