కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు?

గత మంగళవారం నుంచి ప్రధాని మోడీ నిర్వహిస్తున్న మంత్రుల సమావేశం ముగిసినట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని తెలుస్తోంది. ఇవాళ జరిగిన మంత్రుల సమావేశంలో హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. రోజూ నాలుగు నుంచి అయిదుగురు మంత్రులు తమ పనితీరును ప్రజంటేషన్‌ ద్వారా ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. తాము తీసుకున్న నిర్ణయాలు, అమలు తీరును వారు గణాంకాలతో సహా వివరించారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తినడం పాటు పశ్చిమ బెంగాల్‌లో పార్టీ ఓటమి నేపథ్యంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మరిన్ని సీట్లు వచ్చి ఉంటే రాజ్యసభలో స్కోరు పెరిగేది. ఈసారి యూపీ అసెంబ్లీలో సీట్లు తగ్గితే పార్టీకి మరింత గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది రాజ్యసభలో. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ప్రధాని మోడీ మధ్య భేటీ దాదాపు గంటకు పైగా సాగింది. యోగి నుంచి కూడా మోడీ ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్‌ను ఆచితూచి పునర్‌ వ్యవస్థీకరించాలని మోడీ భావిస్తున్నారు. అందుకే వారం రోజుల కసరత్తు మొదలు పెట్టారు. కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఎపుడు ఉంటాయో కచ్చిత తేదీ చెప్పకపోయినా.. ఈ నెలలో ఉంటుందని సీనియర్‌ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Related Articles