నేటి నుంచి యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం స్వస్తీవాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహనతో మొదటి రోజు క్రతువుతు ముగుస్తాయి. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి తిరు కల్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు అందజేయనున్నారు. కాగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను అధికారులు రద్దు చేశారు.

Related Articles