విజయసాయిరెడ్డి తీరును ప్రశంసిస్తున్నా..

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పొగడ్తల వర్షం కురిపించారు. తారకరత్న పార్దివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరు అభినందనీయమన్నారు. పెళ్లిలో, చావులో ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు ముఖం తిప్పుకొని వెళ్ళిపోకుండా పలకరించి, పరామర్శించడం అనేది సత్ సాంప్రదాయమన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంత గౌరవం ఇవ్వాలో విజయసాయిరెడ్డి అంత గౌరవం ఇచ్చారన్నారు. విజయసాయిరెడ్డి తన హోదా తగ్గకుండా చంద్రబాబును గౌరవం ఇనుమడింపజేసేలా వ్యవహరించిన తీరు ప్రశంసనీయమన్నారు. తమ పార్టీపై ప్రజల్లో రోజు రోజుకి వ్యతిరేకత తీవ్రతరమవుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీలలోని లుకలుకలేవి తమ పార్టీని గెలిపించవని.. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలలో లుకలుకలున్నప్పటికీ ఓట్లు వేసేది ప్రజలే కానీ నాయకులు కాదన్నారు. ప్రజల్లో వచ్చిన విప్లవాన్ని చూసైనా విధానాలను మార్చుకోకపోతే ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలిపినా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులే విజయం సాధిస్తారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల సంగతి పక్కన పెట్టి.. ముందు ‘మన పార్టీలోని’ లుకలుకలను సరి చేసుకోవాలని సూచించారు.

Related Articles