ప్రాణాలు తీసుకున్న ప్రాణ స్నేహితులు..

వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఏం చేసినా ఇద్దరూ కలిసే చేసే వారు. ఒకరి విషయాలు మరొకరు పంచుకునేవారు. కానీ ఏం జరిగిందో ఏమో.. ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘట్ కేసర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మేడ్చల్‌ మండలం ఘనపూర్‌కు చెందిన నివాస్‌.. ఘట్‌కేసర్‌ మండలం చౌదరిగూడ పరిధిలోని విజయపురి కాలనీలోని ప్రిన్స్‌టన్‌ కాలేజీలో బీ-ఫార్మసీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కొత్తగూడెం కోరుకొండకు చెందిన సాయిగణేశ్‌ నారపల్లిలోని ఎంజేఆర్‌ మాల్‌లో పని చేస్తున్నాడు. అనుకోకుండా కలిసిన వీరి పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ కలిసి ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కొన్ని నెలలుగా అందులోనే నివాసముంటున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నివాస్‌.. తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సాయిగణేశ్‌ స్నానాల గదిలో విషం తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టారు. లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ చనిపోయి ఉన్నారు. మృతదేహాలను పరిశీలించి, మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. నివాస్‌ దగ్గర దొరికిన సూసైడ్‌ నోట్‌ లో ‘అమ్మా! నన్ను మరచిపోండి…అక్కను జాగ్రత్తగా చూసుకోండి’ అని రాసి ఉంది. బాత్‌రూమ్‌లో పడి ఉన్న సాయిగణేష్‌ నోటి నుంచి నురగలు వచ్చిఉండడంతో విషం సేవించినట్టు భావిస్తున్నారు. మరో వ్యక్తి నివాస్‌ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఇద్దరి మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి ఆత్మహత్యలకు సంబంధించి ఏ వివరాలూ బయటకు రాకపోవడంతో ఒకే గదిలో ఉండే ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందన్నది ఇప్పుడు అంతుతేలని ప్రశ్నగా మిగిలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles