కొడంగల్‌ నుంచే పోటీ చేస్తా..

వచ్చే ఎన్నికల్లో కొడంగల్‌ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పాలకుర్తితో పాటు చాలా చోట్ల నుంచి బరిలో దిగాలని తనపై ఒత్తిడి వస్తున్న మాట వాస్తవమేన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే కొడంగల్‌ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. రేవంత్‌ చేపట్టిన హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కొద్దిసేపు చిట్‌చాట్‌ చేశారు. కాంగ్రెస్‌లో సీఎం పీఠం అధిరోహించే సామర్థ్యం ఉన్నవాళ్లు పది మందికి పైగా ఉన్నారని తెలిపారు. అధిష్ఠానమే సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావటమే తన కర్తవ్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూపులు, విభేదాలు లేవని అన్నారు. కేసీఆర్‌ పాలన వ్యతిరేకించే వాళ్లంతా కాంగ్రెస్‌ వారేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తెలిపారు. జాతీయ స్థాయిలో వామపక్షాలతో కలిసి పని చేస్తామని చెప్పారు. ఏపీలో జనసేనతో కలవడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని, అలాంటి పార్టీతో తెలంగాణలో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనన్నారు. కలిసి ఉండి కాంగ్రెస్‌ను ఏం చేయలేకపోతున్నామని.. విడిగా ఉండి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో అనేక మంది సీఎంలు, మంత్రుల అవినీతిపై విచారణలు చేయిస్తున్న బీజేపీ.. కేసీఆర్‌పై ఎందుకు అలా వ్యవహరించలేకపోతోందని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతిపై బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తమ అధిష్ఠానానికో, సీబీఐకో ఎందుకు ఫిర్యాదు చేయటం నిలదీశారు. బీజేపీతో లోపాయికారిగా పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌తో ఎన్నికల ముందు గానీ, తర్వాతగానీ పొత్తు ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు.

Related Articles