Tokyo Olympics : ఏడ్చేంత టైమ్ లేదు.. కాంస్యంపై గురి..

భారత పురుషుల హాకీ జట్టుకు సెమీస్ లో చుక్కెదురైంది.వరల్డ్ నెంబర్ వన్ బెల్జియంతో జరిగిన పోరులో.. ఇండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‎లో 5-2 తేడాతో బెల్జియం చేతిలో ఇండియా పరాజయం పాలైంది. తొలి క్వార్టర్‌లోనే రెండు గోల్స్‌ చేసి సత్తాచాటిన టీమిండియా ఆ తర్వాత పూర్తిగా ఆటపై పట్టుకోల్పోయింది. దీంతో నాలుగో క్వార్టర్‎లో రెచ్చిపోయిన బెల్జియం… వరుసగా మూడు గోల్స్ చేసింది. చివరకు 5-2 తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్న బెల్జియం ఫైనల్‎కు దూసుకెళ్లింది. ఇక ఈ ఓటమితో భారత్ పసిడి ఆశలు గల్లంతయ్యాయి. కాంస్యం కోసం రెండో సెమీస్‌లో ఓడిన జట్టుతో గురువారం భారత్ తలపడనుంది.సెమీస్ లో ఓటమితో తమ గుండె పగిలిందని హాకీ ప్లేయర్స్ తెలిపారు. 41 ఏళ్ల తర్వాత సెమీస్ చేరిన తరుణంలో ఓటమి గట్టి షాకిచ్చిందన్నారు. అయితే బాధపడేంత సమయం లేదని, గురువారం జరిగే మ్యాచ్ లో గెలిచి, దేశానికి కనీసం కాంస్యమైనా అందించాలన్న పట్టుదలతో ఉన్నామన్నారు.

Related Articles