సెల్‌ఫోన్‌ దొంగిలించాడని చంపేశారు

సెల్‌ఫోన్‌ దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తిని తల్లి కొడుకులు కలిసి తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు.. ఈ ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి… శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురానికి చెందిన దండసాయి రమేష్‌ (35) వృత్తిరీత్యా హోటళ్లల్లో చెఫ్‌గా పని చేసేవాడు. అతను సూరారం కాలనీలో ఉంటూ స్థానికంగా ఉంటున్న హోటళ్లల్లో పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితం గండిమైసమ్మలోని జెఎంజే టిఫిన్‌ సెంటర్‌లో చెఫ్‌గా చేరాడు. అయితే డిసెంబరు 26న హోటల్‌లో సెల్‌ఫోన్, నగదు చోరీకి గురయ్యాయి. రమేష్‌పై అనుమానంతో హోటల్‌ నిర్వాహకుడు రాకేశ్, అతని తల్లి భాగ్యలక్ష్మి అతన్ని చేతులు కట్టేసి కొట్టారు. అయినా ఒప్పుకోకపోవడంతో వెదురు కట్టెలతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో హత్యానేరం నుండి తప్పించుకునేందుకు రాకేష్‌ అతని స్నేహి తులు వెంకటసాయి, వినయ్, మున్నా, సతీశ్, సంపత్, అజారుద్దీన్‌లు మృతదేహాన్ని బహదూర్‌పల్లి సాయినాథ్‌ సొసైటీలో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.రమేష్‌ పలు హోటళ్లలో చెఫ్‌గా పని చేసేవాడని తెలుసుకున్నారు. గండిమైసమ్మలోని జెఎంజే హోటల్‌లో పని చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు స్థానికులను విచారించగా గొడవ విషయం వెలుగులోకి వచ్చింది. రాకేశ్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా రాకేశ్‌ తల్లి భాగ్యలక్ష్మి పరారీలో ఉన్నట్లు తెలిసింది.

Related Articles