ఏపీకి జగరోనా వైరస్‌ పట్టింది

‘ఏపీకి జగరోనా అనే వైరస్‌ పట్టింది. దీనికి చంద్రన్న అనే వ్యాక్సిన్‌ పడితేనే రాష్ట్రం బాగుపడుతుంది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. 20వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఆయన తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చాటూరు, కేవీబీపురం మండలాల్లో పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఎస్సీ సామాజికవర్గీయులు, మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను సావధానంగా విన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ‘ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అన్నారు. ఆ తర్వాత మాటమార్చి మూడు రాజధానులని మొరిగారు. ఇప్పుడేమో జగన్‌కు అవగాహన లేదని మంత్రి బుగ్గన అంటున్నాడు. రాష్ట్రానికి ఒకే రాజధాని విశాఖపట్నమని తేల్చేశాడు. కర్నూలు రాజధాని అని చెప్పి ఇంతకాలం మోసం చేయడం తప్ప ఒక్క ఇటుకైనా పెట్టారా? ఒక్క కంపెనీ తెచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? విశాఖకు జగన్‌ చేసింది, చేయబోయేది ఏమీలేదు. విశాఖ ప్రజల్ని రాజధాని పేరుతో మోసం చేయడం తప్ప. ఈ రోజు వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. గతంలో సీపీఎస్‌ విషయంలోనూ ఇదే చెప్పారు. వారంలో రద్దు చేస్తామన్నారు. తర్వాత జగన్‌కు అవగాహనలేక రద్దు హామీ ఇచ్చారని సజ్జల చెప్పుకొచ్చారు. అంటే జగన్‌కు అవగాహన లేదని వాళ్ల నేతలే చెబుతున్నారు’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

Related Articles