లాక్‌డౌన్‌పై ఇవాళ కేసీఆర్ ప్రకటన

తెలంగాణాలో లాక్‌డౌన్‌ రేపటితో ముగియనుంది. ఎల్లుండి నుంచి లాక్‎డౌన్ పూర్తిగా ఎత్తేయాలా..? లేదా నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించాలా..? అన్న అంశంపై సీఎం కేసీఆర్ సహచర మంత్రులతో చర్చిస్తున్నారు.ఈ సమావేశం తరవాత ఇవాళే ఆయన కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్‌ ప్రస్తుతం ప్రగతిభవన్‌లో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌లతో సమావేశం జరుపుతున్నారు. లాక్ డౌన్ సడలింపుతో పాటు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై కీలకంగా చర్చిస్తున్నారు.
ఢిల్లీ తరహాలో…
దేశ రాజధాని ఢిల్లీ తరహా అన్‎లాక్‎కు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేపటితో లాక్‎డౌన్ ముగియనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఉంది. దీన్ని రాత్రి పది గంటల వరకు పొడిగిస్తారని వార్తలు వస్తున్నాయి. జులై 01 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు, బార్లు, జిమ్‎లకు అనుమతి ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

Related Articles