23న టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో చేరనున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఇమడలేక కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఈ నెల 16న బీజేపీకి రాజీనామా చేసిన ఆయన భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించటానికి సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులతో ఆదివారం గుంటూరులోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్‌, ప్రకాశం జిల్లాల నుంచి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు, రాక్షస పాలనతో రాష్ట్ర భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని తిరిగి బాగు చేయగల సమర్థత, రాజకీయ దక్షత చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు.

Related Articles