అందుకే ప్రాణాలు తీశా..

‘నాకు దక్కనిది ఇతరులకు దక్కకూడదనే కోపంతో ఇష్టమొచ్చినట్లు కత్తితో పొడిచా’ అంటూ కాకినాడ యువతి లీలా పవిత్రను బెంగళూరులో హత్య చేసిన ప్రేమోన్మాది, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం, రెల్లివలస నివాసి దినకర్ పోలీసు విచారణలో వెల్లడించాడు. ఆమెను మంగళవారం రాత్రి మురుగేశ్‌పాల్య వద్ద కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. కేసు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసుల ముందు నిందితుడు పలు విషయాలను వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘నేను ఎంతో ఇష్టంగా ప్రేమించాను. మనసంతా ఆమె.. లీలా లేని లోకం ఊహించలేకపోయా, ఇలా మారుతానని కలలో కూడా అనుకోలేదు’ అంటూ ఆ యువకుడు మానసిక కుంగుబాటుకు లోనయ్యాడని పోలీసులు తెలిపారు. ‘ఎలాగైనా మాట్లాడి పెళ్లికి ఒప్పించేందుకు వారం నుంచి వెంటపడ్డా. మాట్లాడేందుకు నిరాకరించింది. ఆఖరి క్షణంలోనైనా మనసు మార్చుకుంటుందని పలుమార్లు ఫోన్ చేశా. ఆమె ఎంతకూ స్పందించలేదు. ఇక లాభం లేదనే.. దొమ్మలూరులోని ఓ దుకాణంలో కత్తి కొనుగోలు చేశా. రెండు సార్లు దాడి చేయాలని యత్నించా. లీలా ముఖం చూస్తుంటే ఏమీ చేయలేకపోయా. అలా రెండు సార్లు వెనక్కి తగ్గా. చివరికి మంగళవారం రాత్రి మనసు రాయి చేసుకున్నా. కత్తితో కసి తీరా పొడిచి హత్య చేశా’ అంటూ పోలీసుల ముందు నేరం అంగీకరించాడు.

Related Articles