‘కొండగట్టు’ దొంగలు అరెస్ట్

జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ వసతి గృహాల్లో మంగళవారం ఉదయం చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్‌ చేశామని డీఎస్పీ ప్రకాశ్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన దూలం శశాంక్‌, తోకల నితిన్, ఎనగందుల పవన్ చందు, మరో ఇద్దరు మైనర్లు జల్సాలకు అలవాటు పడ్డారు. హోలీ సందర్భంగా కొండగట్టులో దొంగతనం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఓ కారును అద్దెకు తీసుకుని అంజన్న సన్నిధికి చేరారు. మంగళవారం ఉదయం ఏడు గంటల సమయంలో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లగా.. మారుతీ నిలయంలో 11,16 నంబర్ల గదుల తాళాలు పగులగొట్టారు. 4 వేల నగదు, మూడు సెల్ ఫోన్లు దొంగిలించారు. అది గమనించిన భక్తులు పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక ఎస్సై చిరంజీవి మల్యాల ఎస్ఐ వెంకటరమణ మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం దొంగలమర్రి చెక్‌పోస్టు వద్ద సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో వాహానాల తనిఖీ చేస్తుండగా ఈ ఐదుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పట్టుకుని విచారించగా చోరీ చేసింది వారేనని తేలింది. దీంతో వారిని అరెస్‌ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 24 గంటల్లోనే దొంగలను పట్టుకున్న సీఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవిని డీఎస్పీ ప్రకాశ్ అభినందించారు.

Related Articles