చెల్లిని ప్రేమిస్తున్నాడని చంపేశాడు..

హైదరాబాద్‌లోని దూలపల్లిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకున్ని అతి దారుణంగా హత్య చేసిన కేసులో.. ప్రియురాలి అన్న దీన్ దయాల్‌తో కలిపి మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లా సూరారంలో హరీశ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయటం కలకలం రేగింది. ఓ మహిళతో పాటు ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి కత్తులతో కిరాతకంగా నరికి చంపేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావించిన పోలీసులు.. అదే కోణంలో విచారించ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సూరారంలో మైత్రినగర్ కాలనీలో నివాసం ఉంటున్న దేవరకొండ హరీష్ కుమార్.. డీజే ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. హరీశ్ గతంలో అమీర్‌పేట్‌లోని ఎల్లారెడ్డిగూడెంలో కొన్ని రోజులు ఉన్నాయి. ఆ సమయంలోనే ఓ అమ్మాయిని ప్రేమించాడు. కాగా.. సదరు యువతి, హరీశ్‌తో చాటింగ్ చేస్తుండగా.. ఆమె అన్న దీన్ దయాళ్ చూసి.. హెచ్చరించాడు. హరీష్ గురించి తెలుసుకుని.. అతనికి కూడా బెదిరించాడు. దీంతో.. మళ్లీ పునరావృతం చేయనంటూ దీన్ దయాళ్‌కు హామీ ఇచ్చాడు. కానీ.. ఇద్దరూ.. మళ్లీ చాటింగ్ చేసుకోవడమే కాకుండా కలుసుకోవడం కూడా చేశారు. దీంతో.. ఇంట్లో తెలిసి పలుమార్లు మందలించారు కూడా. కుటుంబ సభ్యులు తమ ప్రేమను ఒప్పుకోరని తెలిసి.. పారిపోయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫ్రెండ్ సహాయంతో వివాహం చేసుకొని దూలపల్లికి వెళ్లి జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వెంచర్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా హరీశ్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తన చెల్లెలు హరీష్‌తో పారిపోవడం వల్ల తన కుటుంబ ప్రతిష్ట నాశనం అయ్యిందని భావించిన దీన్ దయాళ్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే హరీష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పథకం రచించాడు. పథకం ప్రకారం ఐదు నెలల క్రితమే ఆయుధాలను కూడా కొన్నాడు. ఐదు నెలలుగా రెక్కి నిర్వహించాడు. హరీష్ స్నేహితుల ద్వారా వాళ్ల ఆచూకీ తెలుసుకున్నాడు. ఆచూకీ తెలిసిన వెంటనే.. తన స్నేహితులతో కలిసి దూలపల్లికి చేరుకున్నాడు. దీన్ దయాళ్ గ్యాంగ్ అంతా.. ఒక్కచోట చేరి దూలపల్లి వైన్ షాప్‌లో మద్యం సేవించారు. హరీష్ స్నేహితులు ప్లాన్ ప్రకారం ఆ కొత్తజంట వెంచర్ నుంచి బయటకు వచ్చేలా పథకం వేశారు. అనుకున్నట్టుగానే.. వాళ్లు బయటికి రాగానే హరీష్‌ను ఒక్కసారిగా చుట్టు ముట్టారు. అమ్మాయి కళ్ల ఎదుటే హరీష్‌ను కత్తులతో పొడిచి పొడిచి అతికిరాతకంగా హత్య చేసి అక్కడి నుండి అమ్మాయిని తీసుకొని పారిపోయారు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. ముందుగా ముగ్గురిన అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. మొత్తం బయటపెట్టేశారు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. ఇంకొకరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Related Articles