సెక్షన్‌ 66A: రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

రద్దయిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు చేయొద్దని పదే పదే హెచ్చరించినా… ఇంకా కేసులు నమోదు కావడంతో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అధికారికంగా స్పందించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ సెక్షన్‌ కింద నమోదైన కేసులు ఎన్ని ఉన్నాయో తెలపాలంటే… అన్ని హైకోర్టుల్లోని రిజిస్ట్రార్‌ జనరల్‌లకు కూడా నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ 2015లోనే సుప్రీం తీర్పు వెలువరించింది. దీనిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలని 2019లోనే ఆదేశాలు జారీచేసింది. అయినా, పలు చోట్ల పోలీసులు సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు చేస్తుండటంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల హోం శాఖ కూడా దీనికి సంబంధించి రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Related Articles