అసెంబ్లీలో మాపై నిందలా?

‘మెడికల్‌ కాలేజీలు లేని జిల్లాల్లో వాటి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపమంటే అప్పటికే మెడికల్‌ కాలేజీలు ఉన్న ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల పేర్లు పంపారు. అక్కడ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని, ఎక్కడైతే లేవో ఆ జిల్లాల పేర్లు ఇవ్వమని మళ్లీ కోరితే స్పందన లేదు. ఇప్పుడేమో 157 మెడికల్‌ కాలేజీల్లో ఒక్కటీ తెలంగాణకు ఇవ్వలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది’ అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఎన్డీఏ’ అంటే ‘నో డేటా గవర్నమెంట్‌’ అంటున్నారని, మీకు మీ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఉన్నాయన్న డేటానే లేనప్పుడు అసెంబ్లీలో నిలబడి మాపై నిందలు వేస్తే ఎలా? హోంవర్క్‌ చేసుకుని నిజం మాట్లాడితే బాగుంటుందని బీఆర్‌ఎస్‌ సర్కారుకు సూచించారు. డీడీ డైలాగ్‌ పేరుతో దూరదర్శన్‌ ఆధ్వర్యంలో గురువారం హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన అమృతకాల బడ్జెట్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సభికులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 2014 నుంచి ఇప్పటివరకు 157 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయని, అక్కడే నర్సింగ్‌ కాలేజీలూ ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్‌లో చెప్పామని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రానికి రూ.1.30 లక్షల కోట్లు వచ్చాయన్నారు. 2021-22లో రూ.17,165 కోట్లు, 2022-23లో రూ.19,668 కోట్లు, 2023-24లో రూ.21,470 కోట్లు ఇచ్చామన్నారు.

Related Articles